GHMC: తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పట్టణ పాలనలో సరికొత్త విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో సరికొత్త అవసరాలకు అనుగుణంగా సరికొత్త చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ భవిష్యత్తు పట్టణ పాలన కోసం ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదా (డ్రాఫ్ట్)ను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ఈ అత్యంత కీలకమైన కొత్త బిల్లుపై భాగ్యనగర ప్రజలు, పట్టణ అభివృద్ధి నిపుణుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను, సలహాలను ఆహ్వానించింది. నగర భవిష్యత్తును మార్చబోయే ఈ చట్టంలో ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో.. జూలై 24, 2026 లోగా ఆన్లైన్ ద్వారా కానీ లేదా మున్సిపల్ శాఖకు లిఖితపూర్వకంగా కానీ తమ సూచనలను పంపవచ్చని స్పష్టం చేసింది. 1955లో రూపొందించిన పాత జీహెచ్ఎంసీ చట్టంలోని చాలా నిబంధనలు ప్రస్తుత గ్లోబల్ సిటీ అవసరాలకు సరిపోవడం లేదని, కాలానుగుణత కోల్పోయిన అలాంటి పాత నిబంధనలన్నింటినీ ఈ కొత్త బిల్లు ద్వారా పూర్తిగా తొలగించనున్నారు.
ఆధునిక పట్టణ పాలనను అందించడం, సమగ్ర పౌర సేవలను వేగవంతం చేయడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా నెట్ జీరో (Net Zero) కార్బన్ ఉద్గారాల లక్ష్యాలను అందుకోవడం వంటి అంశాలకు ఈ కొత్త బిల్లులో అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నగరంలో వ్యాపార సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) మరింత పెంపొందించడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడమే ధ్యేయంగా ఈ సరికొత్త చట్టాన్ని డిజైన్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు వీలుగా రూపొందించిన ఈ ముసాయిదా బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి, తగిన సూచనలు చేయాల్సిందిగా నగరంలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు (RWA), పౌరసమాజ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పిలుపునిచ్చింది.




