Fire Accident : నగరంలోని మీర్చౌక్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మీర్చౌక్ ప్రాంతంలోని ఓ నివాస భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 10 ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఇంటి నిర్మాణం తేడాగా ఉండడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఊపిరాడక 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో 14 మందిని రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఫైర్ సిబ్బందికి ఆక్సిజన్ సిలిండర్లు లేకపోవడంతో ప్రాణహానికీ కారణమై ఉండొచ్చని పేర్కొన్నారు. రెస్క్యూలో ఆలస్యం జరగడం తీవ్రతను పెంచిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
మృతుల వివరాలు ఇలా ఉన్నాయి
అభిషేక్ మోడీ (30)
ఆరుషి జైన్ (17)
హర్షాలి గుప్తా (7)
షీతల్ జైన్ (37)
రాజేందర్ కుమార్ (67)
సుమిత్ర (65)
మున్నిబాయి (72)
ఇరాజ్ (2)
ఇంకా ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. భవనంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాదానికి దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియనున్నాయి.