దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం ఒక్కసారిగా భూమి కంపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని నోయిడా, గురుగ్రామ్లతో పాటు పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, కార్గిల్ ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా ఇళ్లు, కార్యాలయాలు ఊగిపోవడంతో జనం ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.
నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదిక ప్రకారం.. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని దరావన్ సమీపంలో సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. భూ అంతర్భాగంలో సుమారు 5 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమయ్యాయి. లూధియానా, చండీగఢ్, శ్రీనగర్, పూంచ్ వంటి నగరాల్లో కూడా ప్రజలు కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలను స్పష్టంగా అనుభవించారు. ఇంట్లోని వస్తువులు కింద పడిపోయాయని, భవనాలు ఊగడాన్ని గమనించామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు జనవరి నెలలో కూడా ఒక సోమవారం ఉదయం 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. అప్పట్లో ఉత్తర ఢిల్లీ కేంద్రంగా ఈ ప్రకంపనలు వచ్చాయి. తాజా ఘటనలో ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉన్నప్పటికీ, దాని ప్రభావం ఉత్తర భారతంపై తీవ్రంగా పడింది.
ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎక్కడా ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ప్రకంపనలు ఆగిపోయిన తర్వాత కూడా ప్రజలు చాలా సేపటి వరకు తమ నివాసాల్లోకి వెళ్లడానికి భయపడ్డారు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.




