Damodara Raja Narasimha : ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రైవేట్ హాస్పిటల్స్లో సిజేరియన్ డెలివరీలు అత్యధికంగా చేస్తున్నట్లు గుర్తించి, ఈ విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన సి-సెక్షన్ ఆడిట్ను మరింత కఠినంగా నిర్వహించాలని సూచించారు. గురువారం, కోఠీలోని టీజీఎంఎస్ఐడీసీ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, మంత్రి ప్రభుత్వ హాస్పిటల్స్లో నార్మల్ డెలివరీల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. నార్మల్ డెలివరీలు చేసే లాభాలను, సి-సెక్షన్ వల్ల కలిగే నష్టాలను గర్భిణీలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఏంటి నాటల్ చెకప్స్ సమయంలో వివరించాలని ఆయన సూచించారు.
మరిన్ని నార్మల్ డెలివరీలు జరగాలంటే, ప్రభుత్వ హాస్పిటల్స్లో పనిచేస్తున్న నర్సులకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. అలాగే, మాతా-శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో వసతులను మెరుగుపరచాలని, గర్భిణులను ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ చేయించుకోవడానికి ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఎండలు మరియు అధిక ఉష్ణోగ్రతలు కారణంగా గర్భిణీలు, బాలింతలు, పిల్లలు హాస్పిటల్స్లో ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. అన్ని హాస్పిటల్స్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని, అవసరమైన వార్డులలో ఏసీలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అలాగే, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు.
ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై కూడా మంత్రి ఆరా తీశారు. గతేడాది 8 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసినట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 6200కి పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. డాక్టర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ ఆఫీసర్లు, మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ వంటి పోస్టుల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఫలితాలు విడుదల చేసి, నెల రోజుల్లో భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి సకాలంలో ప్రమోషన్లు ఇవ్వాలని, ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, కమిషనర్ ఆర్ వీ కర్ణన్, టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్, డీహెచ్ డాక్టర్ రవిందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..