Birth Rate: భారత్లో జననాల రేటు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచ ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో జననాల రేటు తగ్గుదలపై ఎక్స్ లో వచ్చిన ఓ పోస్టుకు స్పందించిన మస్క్.. అత్యంత విద్యావంతులైన వర్గాల్లోనే జననాల రేటు వేగంగా తగ్గుతోందని తన భావాన్ని వ్యక్తపరిచారు. ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జననాల రేటుపై ఆయన గతంలోనూ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా విడుదలైన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (SRS) గణాంకాల ప్రకారం.. భారత్లో మొత్తం జననాల రేటు (TFR) మహిళకు 1.9 పిల్లలకు పడిపోయింది. ఇది జనాభా స్థిరంగా కొనసాగడానికి అవసరమైన 2.1 స్థాయి కంటే తక్కువ అవ్వడం గమనించాల్సిన విషయం. పదేళ్ల క్రితం ఈ రేటు 2.3గా ఉండగా, ప్రస్తుతం భారీగా తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. అక్కడ జననాల రేటు కేవలం 1.2గా నమోదైంది. దేశంలోనే అత్యల్ప స్థాయిల్లో ఇది ఒకటి. కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కూడా చాలా కాలంగా కావలిసిన స్థాయి కంటే తక్కువ జననాల రేటును నమోదు చేస్తున్నాయి. అయితే ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా జననాల రేటు బాగానే ఉంది.
ఈ విషయమై నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆధునిక జీవనశైలి ఈ మార్పుకు ప్రధాన కారణంగా మారుతోంది. గతంలో యువత తక్కువ వయస్సులోనే వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ప్రారంభించేవారు. ప్రస్తుతం ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు, కెరీర్ లక్ష్యాలు, గృహ కొనుగోలు వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల వివాహాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో పిల్లల ప్రణాళికలో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. పిల్లల పెంపకం ఖర్చులు కూడా కుటుంబాల నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, అదనపు శిక్షణ కార్యక్రమాలు, పెద్ద ఇళ్ల అవసరం వంటి అంశాలు పట్టణ ప్రాంతాల్లో పిల్లల పెంపకాన్ని మరింత ఖరీదైనదిగా మార్చాయి. ఫలితంగా గతంలో సాధారణంగా భావించిన కుటుంబ పరిమాణం ఇప్పుడు చాలా మందికి ఆర్థికంగా భారంగా కనిపిస్తోంది.
మహిళల ఉన్నత విద్య, ఉద్యోగాల్లో పెరుగుతున్న భాగస్వామ్యం కూడా జననాల రేటు తగ్గుదలకు ముఖ్య కారణంగా భావిస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో కనిపించినట్లుగానే.. భారతదేశంలో కూడా మహిళలు ముందుగా కెరీర్ను స్థిరపరచుకోవాలనే ఆలోచనతో కుటుంబ విస్తరణను వాయిదా వేస్తున్నారు. ఇది మాతృత్వాన్ని తిరస్కరించడం కాదని, కానీ దానిని ఆలస్యంగా స్వీకరించే ధోరణిగా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కుటుంబ వ్యవస్థల విషయంలో కూడా సామాజిక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చిన్న కుటుంబాలు ఇప్పుడు పట్టణాల్లో సాధారణంగా మారాయి. కొందరు దంపతులు ఒక్క బిడ్డతోనే సరిపెట్టుకుంటుండగా, మరికొందరు పిల్లలు లేకుండా జీవించడానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో భారతదేశంలో జనాభా పెరుగుదలపై ఉన్న చర్చలు ఇప్పుడు జననాల రేటు తగ్గుదల వైపు మళ్లుతున్నాయి.
ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటిగా ఉన్నప్పటికీ.. ప్రధాన నగరాల్లో కనిపిస్తున్న ధోరణులు తూర్పు ఆసియా, యూరప్ దేశాల్లో ఎదురవుతున్న పరిస్థితులను గుర్తు చేస్తున్నాయి. అక్కడ తక్కువ జననాల రేటు దీర్ఘకాలిక సవాలుగా మారింది. ఈ అంశంపై గత కొంత కాలంగా కొందరు దక్షిణ భారతదేశ రాజాకీయ నేతలు బహిరంగానే జననాల రేటు పడిపోతుంది.. పిల్లలను కనండి అంది బహిరంగానే చెప్పడం గమనించవచ్చు.
India’s birth rate has fallen below replacement.
Among those most educated, India’s birth rate fell below replacement many years ago. https://t.co/RsWf0PK6wx
— Elon Musk (@elonmusk) June 6, 2026




