Bangladesh: భారత్ అంటేనే ద్వేషంతో రగిలిపోతున్నాడు బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్ యూనస్. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఇతను భారత్ వ్యతరేక ప్రచారాన్ని బంగ్లాదేశ్లో ముమ్మరం చేశాడు. భారత్ అంటే పడని జమాతే ఇస్లామీ, బీఎన్పీ పార్టీ నేతల్ని తన సలహాదారుగా ఎంపిక చేసుకున్నాడు. ఆ తర్వాత, భారత ప్రత్యర్థి పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నాడు. 1970లో బంగ్లాదేశ్పై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాలను మరిచిపోయి స్నేహ హస్తం అందిస్తు్న్నాడు.
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్ భారత్కి వ్యతిరేకంగా కొత్త కుట్రకు తెర తీసింది. భారత వ్యూహాత్మక ప్రాంతమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ కి సమీపంలో బంగ్లాదేశ్ భూభాగంలో లాల్మొనిర్హాట్ ప్రాంతంలో ఒక వైమానిక స్థావరాన్ని చైనాకు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది చైనా చేతిలో ఉంటే, భారత్కి ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఎందుకంటే, ఈ సిలిగురి కారిడార్ భారత్ మిగతా ప్రాంతాలతో ఈశాన్య రాష్ట్రాలను కలిపే ఇరుకైన మార్గం కేవలం 20 కి.మీ వెడల్పు ఉండే ఈ ప్రాంతాన్ని కట్ చేస్తే, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Read Also: Hyderabad: హైదరాబాద్లో పేలుళ్లకు ప్లాన్.. ఐసీస్ ఆపరేషన్ని భగ్నం చేసిన పోలీసులు
తాజాగా, చైనా అధికారులు రహస్యంగా బంగ్లాదేశ్లో పర్యటించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ లాల్మొనిర్హాట్ ఎయిర్ బేస్ని చైనా అధికార బృందం సందర్శించినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా భారత సరిహద్దు ప్రాంతంలోని చికెన్ నెక్ కారిడార్ సమీపంలో ఇతర ప్రాంతాలను కూడా సందర్శించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ వైమానిక స్థావరాన్ని పునరుద్ధరించడానికి, భారత సరిహద్దు నుండి కేవలం 20 కి.మీ దూరంలో ఉన్న రంగ్పూర్ డివిజన్లో ఉన్న ప్రదేశంలో విమానాశ్రయాన్ని నిర్మించడానికి బంగ్లాదేశ్ చైనా నుండి సహాయం కోరుతున్నట్లు సమాచారం.
భారత నిఘా ఏజెన్సీలు ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఈ స్థలాన్ని ప్రభుత్వ విమానాశ్రయంగా అభివృద్ధి చేస్తున్నారా..? లేదా ఫైటర్ పైలట్లకు శిక్షణ ఇవ్వడానికి, ఫైటర్ జెట్స్ ఉంచేలా ఎయిర్ బేస్ అభివృద్ధి చేస్తున్నారా అనే దాని గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది. ఈ స్థావరాన్ని భారత్కి వ్యతిరేకంగా చైనా, పాకిస్తా్న్ ఉపయోగించేందుకు బంగ్లాదేశ్ అనుమతిస్తుందా..? అనే దానిని పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ అధికారులు కూడా చికెన్ నెక్ సమీపంలోని రంగ్పూర్ డివిజన్ని సందర్శించారు.