Anaparthi: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న దొంగల ముఠాను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మొత్తం 13 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి భారీ మొత్తంలో బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెలలో జరిగిన మహేంద్రవాడ చోరీ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా జిల్లేళ్ల రాకేష్ అనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఈ చోరీల వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు వెల్లడైంది.
రాకేష్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, ముఠాలోని మరో ముగ్గురు సభ్యులు చెల్లూరి జగదీష్, చెల్లూరి వీరేంద్ర, టి. సత్యనారాయణలను అరెస్ట్ చేశారు. వీరు అనపర్తితో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.75 లక్షల 85 వేల విలువైన బంగారు ఆభరణాలు, అలాగే 6.5 కిలోల వెండి వస్తువులు, ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన సొత్తు విలువ లక్షల్లో ఉండటంతో ఈ కేసు జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ముఠాపై అనపర్తి, కడియం, అంగర, మండపేట, తణుకు, తాడేపల్లిగూడెం, పెనుగొండ ప్రాంతాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 13 కేసులు నమోదై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. చోరీలతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు, నిందితుల అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నారు. కేసును ఛేదించి భారీ రికవరీ సాధించిన పోలీసు అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.




