నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. నచ్చిన దుస్తులు ధరించలేకపోవడం, నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆత్మన్యూనతకు లోనవ్వడం వంటివి మానసిక వేదనకు గురిచేస్తాయి. వ్యాయామాలు చేసినా, కఠినమైన డైట్లు పాటించినా ఆశించిన ఫలితం రాకపోవడంతో చాలామంది నిరాశ చెందుతుంటారు. ముఖ్యంగా ‘బరువు తగ్గడం అనేది ఒక యుద్ధం’లా భావించే వారికి.. సరైన సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు భరోసా ఇస్తున్నారు. ఆహారం ఏది తింటున్నామనే దానికంటే, ఎప్పుడు తింటున్నాం అనేదే మీ బరువును నిర్ణయిస్తుంది.
బరువు తగ్గడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విధానం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. అయితే ఇది అందరికీ ఎందుకు పని చేయడం లేదన్న దానిపై స్పెయిన్లోని బార్సెలోనా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏడేళ్ల పాటు సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఈ పరిశోధన ప్రకారం, కేవలం ఉపవాసం ఉండటమే కాదు, భోజన సమయాలు మన శరీరంలోని జీవగడియారం (Circadian Rhythm) తో సరిపోలాలి.
కీలకమైన మార్పులు ఇవే..
రాత్రి 7 గంటల లోపే భోజనం పూర్తి చేయాలి. నిద్రపోవడానికి కనీసం 3-4 గంటల ముందే తినడం వల్ల శరీరం కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. రాత్రిపూట ఎక్కువ సేపు కడుపు ఖాళీగా ఉండటం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది.
ఉదయం నిద్రలేచిన గంటలోపే బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. ఇది రోజంతా అతిగా తినాలనే కోరికను నియంత్రిస్తుంది. రాత్రి భోజనానికి, మరుసటి రోజు ఉదయం అల్పాహారానికి మధ్య కనీసం 12 నుంచి 14 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఈ గ్యాప్ వల్ల ఇన్సులిన్ స్థాయిలు అదుపులో ఉండి, టైప్-2 డయాబెటిస్ ప్రమాదం కూడా తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడేవారు కేవలం ఆహారం తగ్గించడం కాకుండా.. ఈ సమయపాలనను పాటిస్తే సులభంగా, ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చని ఇతర పోషకాహార నిపుణులు కూడా సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఈ జీవగడియారాన్ని అనుసరించడమే శాశ్వత పరిష్కారం.




