డిజిటల్ చెల్లింపుల్లో వేగానికి మారుపేరైన యూపీఐ (UPI) లావాదేవీల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కీలక మార్పును తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతం మనం ఎవరికైనా డబ్బులు పంపిస్తే అవి క్షణాల్లో అవతలి వ్యక్తి ఖాతాలోకి వెళ్లిపోతున్నాయి. అయితే, ఈ వేగాన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయకులను మోసం చేస్తున్నారు. ఒకసారి డబ్బులు పంపాక వాటిని వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే.. పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీల (High-value transfers) విషయంలో సుమారు ఒక గంట పాటు ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ (విరామ సమయం) ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది.
ఎందుకు ఈ మార్పు.. ?
పొరపాటున ఎవరికైనా తప్పుడు అడ్రస్కు డబ్బులు పంపితే, ఆ గంట లోపు లావాదేవీని ఆపే అవకాశం (Reversal window) ఉంటుంది. చాలామందిని ఫోన్ల ద్వారా భయపెట్టో, ఆశ చూపించో నేరగాళ్లు డబ్బులు పంపించుకుంటారు. ఈ గంట సమయం ఉంటే, బాధితులు ఆలోచించుకుని ఆ ట్రాన్సాక్షన్ను రద్దు చేసుకోవచ్చు. ఈ నిబంధన కేవలం పెద్ద మొత్తంలో ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి పంపే డబ్బులకే వర్తిస్తుంది. మీరు దుకాణాల్లో వస్తువులు కొన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిన్నపాటి చెల్లింపులు చేసినా అవి ఎప్పటిలాగే తక్షణమే జరుగుతాయి.
Also Read:RR Manager: రాజస్థాన్ రాయల్స్ మేనేజర్కు రూ. లక్ష జరిమానా.. బుడ్డొడు (వైభవ్ సూర్యవంశీ) జస్ట్ మిస్..
డిజిటల్ చెల్లింపులు వేగంగా ఉండటమే కాదు, సురక్షితంగా ఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ దాడులను అరికట్టడానికి ఈ “గోల్డెన్ అవర్” (మొదటి గంట) ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు పంపేటప్పుడు ఆందోళన చెందకుండా, ధీమాగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. మొత్తానికి.. యూపీఐ వేగాన్ని తగ్గించడం కంటే, వినియోగదారుల డబ్బుకు భద్రత కల్పించడమే ఆర్బీఐ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.




