కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించిన ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ ద్వారా భారీ ఆర్థిక కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. జిల్లాలోని కిసాన్నగర్ ఆర్బీఎల్ (RBL) బ్యాంక్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన ఈ భారీ స్కామ్లో సుమారు రూ.137 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. చైనాకు చెందిన కొందరు వ్యక్తులతో చేతులు కలిపి స్థానిక యువత ఈ మోసాలకు పాల్పడటం గమనార్హం.
కుంభకోణం ఎలా జరిగింది..?
ఈ ముఠా ప్రధానంగా ‘మ్యూల్ ఖాతాల’ (Mule Accounts) నెట్వర్క్ను ఉపయోగిచుకుంది. సాధారణ వ్యక్తుల పేరిట బ్యాంక్ ఖాతాలను తెరిపించి, వాటిని అక్రమ సొమ్మును మళ్లించడానికి వాడటాన్ని మ్యూల్ అకౌంట్స్ అంటారు. కిసాన్నగర్ బ్రాంచ్లోని కేవలం 7 మ్యూల్ ఖాతాల ద్వారానే ఏకంగా రూ.137 కోట్ల మేర లావాదేవీలు నిర్వహించినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) గౌస్ ఆలం వెల్లడించారు.
చైనా లింకులు ..
ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడు బండారి సాయిరామ్ కీలక పాత్ర పోషించాడు. ఇతడు చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ అక్రమ లావాదేవీలను పర్యవేక్షించినందుకు గాను సాయిరామ్ ప్రతి ట్రాన్సాక్షన్పై 2 శాతం కమీషన్ను క్రిప్టో కరెన్సీ రూపంలో పొందేవాడు. ఇలా మొత్తం మీద నిందితులకు సుమారు రూ.2 కోట్ల వరకు కమీషన్ లభించినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితుల అరెస్ట్ ..
పోలీసులు చేపట్టిన పక్కా ఆపరేషన్లో భాగంగా మొత్తం 8 కేసులు నమోదు చేసి.. 13 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే.. ఈ ముఠాలో డిప్లొమా, డిగ్రీ , ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వీరు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి తమ భవిష్యత్తును పాడుచేసుకున్నారు.
బ్యాంక్ ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడం లేదా తెలియని వ్యక్తుల లావాదేవీలకు వాడటం చట్టరీత్యా నేరమని సీపీ గౌస్ ఆలం హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు ఇటువంటి తక్కువ కాలంలో ఎక్కువ లాభం వచ్చే ఆశల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.




