Cricket Umpire Manik Gupta Dies: ఉత్తరప్రదేశ్ లో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ (KCA)కు చెందిన సీనియర్ అంపైర్ మాణిక్ గుప్తా తేనెటీగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉన్నావ్ జిల్లాలోని శుక్లాగంజ్ సప్రూ మైదానంలో జరిగిన క్రికెట్ లీగ్ మ్యాచ్ సమయంలో జరిగింది. బుధవారం (Feb 18) నిర్వహించిన KDM లీగ్ మ్యాచ్లో అంపైరింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా తేనెటీగల గుంపు మైదానంలోకి దూసుకొచ్చింది.
Abhishek Sharma: 0, 0, 0.. పరువు తీసావుగా.. T20 ప్రపంచ కప్లో ‘అత్యధిక డక్లు’ రికార్డు సమం!
ఈ దాడిలో అంపైర్ మాణిక్ గుప్తా, మరో అంపైర్ జగదీశ్ శర్మతో పాటు పలువురు ఆటగాళ్లు చిక్కుకున్నారు. సుమారు 10 నిమిషాల పాటు తేనెటీగలు తీవ్రంగా కుట్టడంతో మాణిక్ గుప్తా తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర గాయాలతో ఉన్న మాణిక్ గుప్తాను వెంటనే శుక్లాగంజ్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండటంతో కాన్పూర్ నగరంలోని హాలెట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కార్డియాలజీ విభాగానికి రిఫర్ చేయగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
మాణిక్ గుప్తా కాన్పూర్లోని ఫీల్ఖానా ప్రాంతానికి చెందినవారు. గత 30 సంవత్సరాలుగా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్ తో అనుబంధంగా అంపైర్గా సేవలందిస్తున్నారు. ఆయనకు నాలుగు కుమార్తెలు ఉన్నారు. నేడు (గురువారం) కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ఘటనపై మరో అంపైర్ సునీల్ మాట్లాడుతూ.. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లు నీరు తాగుతుండగా తేనెటీగల గుంపు అకస్మాత్తుగా దాడి చేసిందని తెలిపారు. అందరూ నేలపై పడుకోవాలని సూచించినప్పటికీ, తేనెటీగల దాడి కొనసాగిందని చెప్పారు. ఈ ఘటనలో పలువురు ఆటగాళ్లు కూడా గాయపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, క్రికెట్ వర్గాలు మాణిక్ గుప్తా మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.




