వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చాక పశ్చిమ బెంగాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర స్థాయిలో హింస చెలరేగింది. ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, మాల్డా, హుగ్లీతో సహా ఇతర జిల్లాల్లో హింస చెలరేగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇక 200 మంది నిరసనకారులు అరెస్ట్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Alluri Sitharamaraju District: అరకులోయలో మరో చేతబడి హత్య కలకలం..!
అయితే తాజాగా బెంగాల్ హింసపై దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. హింసను నివారించడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ దర్యాప్తును సుప్రీం ధర్మాసనమే పర్యవేక్షించాలని న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా కోరారు. ప్రాణాలను కాపాడటానికి, హింసను నిరోధించడానికి సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గత కొద్దిరోజులుగా బెంగాల్ నిరసనలతో అట్టుడుకుతోంది. ఎక్కువగా ముర్షిదాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రైల్వే ఆస్తులు ధ్వంసం, పోలీస్ వాహనాలకు నిప్పుపెట్టడం ఇలా అనేక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పోలీసులు.. లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. అయినా కూడా పరిస్థితులు సద్దుమణగ లేదు. ఎక్కడో చోట ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఇదిలా ఉంటే వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని ఇప్పటికే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. విభజన రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని తెలిపారు. అయినా కూడా అల్లర్లు ఆగలేదు. పెద్ద ఎత్తున నిరసనలు చోటుచేసుకుని హింస చెలరేగింది.
ఇది కూడా చదవండి: East Godavari: బలభద్రపురంలో మరోసారి క్యాన్సర్ కేసుల సర్వే.. కారణం ఇదే!