ఉక్రెయిన్లో ప్రతి ఏడాది ఆస్తుల వివరాలు ప్రకటించడం ఆనవాయితీ. ప్రభుత్వ పెద్దలు గానీ.. అధికారులు గానీ ఆస్తుల వివరాలు బహిరంగంగా వెల్లడించాలి. తాజాగా ఈ ప్రక్రియలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ జీతం, కుటుంబ ఆదాయ వివరాలను ప్రకటించారు. 2024లో వేతనంతో పాటు ఎంత ఆదాయ వచ్చిందో బహిరంగంగా వెల్లడించారు. అయితే 2013లో కంటే 2014లో ఆదాయం పెరిగినట్లుగా తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.
2024లో తన జీతం, కుటుంబ ఆదాయం 15.2 మిలియన్ల ఉక్రేనియన్ హ్రైవ్నియాలని వెల్లడించారు. భారత కరెన్సీ ప్రకారమైతే దాదాపు రూ. 3.15 కోట్లు. ఇక గత సంవత్సరం జీతంగా 336,000 ఉక్రేనియన్ హ్రైవ్నియాలను అందుకున్నట్లు తెలిపారు. 2023లో వివరాలు వెల్లడించినప్పుడు కుటుంబ ఆదాయం 12 మిలియన్ల ఉక్రేనియన్ హ్రైవ్నియాలుగా పేర్కొన్నారు. 2023లో కుటుంబ సభ్యుల ఆదాయం 316,700 డాలర్లు (రూ. 2.7 కోట్లు)గా చెప్పారు. అంటే 2023లో కంటే 2024లో భారీగా ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభుత్వ సేల్స్ బాండ్స్ నుంచి 8,585,532 (రూ.1.77 కోట్లు) హ్రైవ్నియాలు ఉన్నట్లుగా తెలిపారు.
2019లో ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్స్కీ బాధ్యతలు చేపట్టారు. అంతకముందు జెలెన్స్కీ ఒక నటుడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆస్తులు హెచ్చుతగ్గులకు లోనవుతూ వస్తోంది. ఇక 2022లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం చేస్తోంది. అప్పటి నుంచి ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోతుంది. ఇటీవల రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తోంది. కానీ శాంతి చర్చలు సఫలం కాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ షరతులు పెట్టడంతో చర్చలు సఫలీకృతం కాలేదు. జెలెన్స్కీ.. అధ్యక్ష పదవి నుంచి దిగితేనే.. కాల్పుల విరమణ చర్చలు జరుపుతామని పుతిన్ తేల్చిచెప్పారు. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు.




