AP and Telangana Rain Alert: ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కదలికల కారణంగా రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని హెచ్చరించారు.
ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాబోయే మూడు గంటలు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఏలూరు, నూజివీడు, ఆగిరిపల్లి, గన్నవరం, మైలవరం, నున్న, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాలు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల వద్ద ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచించారు.
మరోవైపు తెలంగాణలో కూడా ఇవాళ, రేపు వాతావరణం మేఘావృతమై ఉంటుందని అధికారులు చెప్పారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. అదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశాలు ఉన్నాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.




