Botsa Satyanarayana: రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన చర్చించామని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. డీఎస్సీ అవకతవకలు, రైతులు, ఉద్యోగులు, బలహీన వర్గాలు, శాంతిభద్రతలు, లాకప్ డెత్లు సహా అనేక అంశాలను సభలో ప్రస్తావిస్తామని చెప్పారు. డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని బొత్స విమర్శించారు. స్పోర్ట్స్ కోటా పేరుతో ఫేక్ జీవోలు తీసుకొచ్చారని ఆరోపించారు. మెరిట్ జాబితాల్లో కూడా అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నారు. డీఎస్సీ వ్యవహారంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలనేది తమ ప్రధాన డిమాండ్ అని స్పష్టం చేశారు. డీఎస్సీ అంశంపై సీబీఐ విచారణ కూడా తమ చర్చలో భాగంగా ఉంటుందని తెలిపారు. ఫోన్లలో డీఎస్సీ బేరాలు జరిగితే కేసులు ఎందుకు పెట్టడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రైతులు, ఉద్యోగుల సమస్యలపై చర్చ
పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బొత్స అన్నారు. కరువు కారణంగా రైతాంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదని, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుతోందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రతి అంశంపై కచ్చితంగా సభలో చర్చిస్తామని బొత్స స్పష్టం చేశారు.
వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి
తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కావాలంటే వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలని బొత్స అన్నారు. స్పీకర్ గతంలో అనేకసార్లు అనర్హత అంశంపై మాట్లాడారని గుర్తుచేశారు. తన పరిధిలో ఉంటే అనర్హత వేటు వేయవచ్చని స్పీకర్ చెప్పారని తెలిపారు. అయితే ఇలాంటి బెదిరింపులకు వైసీపీ భయపడదని బొత్స స్పష్టం చేశారు. స్పీకర్ తమ పార్టీ నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు.
‘ఫేక్ పోలీసులతో పాలన సాగిస్తున్నారా?’
తాము శాంతి ర్యాలీలు నిర్వహించినా అక్రమ కేసులు పెట్టారని బొత్స ఆరోపించారు. ఫేక్ పోలీసులు అంటూ మంత్రి మాట్లాడితే పరిస్థితి పరాకాష్టకు చేరినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చుందా అని ప్రశ్నించారు. ‘ఫేక్ పోలీసులతో మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా చంద్రబాబు గారు?’ అంటూ బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి, లాకప్ డెత్లతో పాటు ఇతర శాంతిభద్రతల అంశాలను అసెంబ్లీలో ప్రశ్నిస్తామని తెలిపారు.
బలహీన వర్గాలపై అక్రమ కేసులా?
బలహీన వర్గాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని బొత్స ఆరోపించారు. చిన్న చిన్న విషయాలకే కేసులు పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు డీఎస్సీకి సంబంధించి ఫోన్లో బేరసారాలు జరిగితే కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఫేక్ పోలీసుల వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు ఏం కర్మ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎప్పుడు వాస్తవాలు మాట్లాడారని ప్రశ్నిస్తూ, ఆయన ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రజల కర్మేనని బొత్స తీవ్ర విమర్శలు చేశారు. ఇక, ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఏ సమావేశం నిర్వహించినా తమ పార్టీని, తమ పార్టీ అధినేత జగన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటోందని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టడమే తమ లక్ష్యమని బొత్స స్పష్టం చేశారు. డీఎస్సీ అవకతవకలు, లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణ, రైతులు, ఉద్యోగుల సమస్యలు, బలహీన వర్గాలపై కేసులు, లా అండ్ ఆర్డర్, లాకప్ డెత్లు సహా అన్ని అంశాలను సభలో ప్రస్తావిస్తామని తెలిపారు..




