YS Jagan: ప్రజా సమస్యలపై గతంలో మాదిరిగానే ఇకపై కూడా మరింత గట్టిగా పోరాడాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పార్టీ శాసనసభాపక్ష సభ్యులకు పిలుపునిచ్చారు. రానున్న అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు పార్టీ సభ్యులంతా పూర్తి సన్నద్ధంగా ఉండాలని సూచించారు. అయితే, వైసీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పిస్తే సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వాల్సి వస్తుందని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సభలో మాట్లాడే సమయం హక్కుగా లభిస్తుందని తెలిపారు. ఆ హక్కును ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టం లేకపోవడం వల్లే వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో అసెంబ్లీలో పార్టీ తరఫున చేయగలిగింది పరిమితంగా ఉంటోందని అన్నారు.
ప్రెస్మీట్ల ద్వారా ప్రజలకు సమాధానం
అసెంబ్లీలో ప్రభుత్వం ప్రస్తావించే అంశాలకు ఆధారాలు, సాక్ష్యాలతో తాను ప్రెస్మీట్లు నిర్వహిస్తానని జగన్ తెలిపారు. ప్రతి అంశంలోనూ ప్రజలకు నాణేనికి రెండోవైపు చూపిస్తామని చెప్పారు. ప్రభుత్వం సభలో ఏ అంశాన్ని ప్రస్తావించినా దానికి సంబంధించిన వాస్తవాలను ఆధారాలు, సాక్ష్యాలతో ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
మండలిలో బలంతో పోరాడాలి
శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ బలాన్ని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలని, ప్రజల తరఫున మండలిలో గట్టిగా పోరాడాలని పార్టీ మండలి సభ్యులకు సూచించారు. రాబోయే సమావేశాల్లో సభ్యులంతా పూర్తి సన్నద్ధతతో ఉండాలని, ప్రజలకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమర్థంగా ప్రస్తావించాలని జగన్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో అవకాశాలు పరిమితమైనప్పటికీ, మండలి వేదికగా ప్రజల సమస్యలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై వైసీపీ గతంలోనూ పోరాటం చేసిందని, ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో మరింత గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. సభలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడంతో పాటు, బయట కూడా వాస్తవాలను ప్రజలకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..




