భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జగన్ విమర్శించారు.
‘ఆక్వా రైతులు ఉపయోగించే ఫీడ్ ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా ధరలు పెంచకుండా రెగ్యులేటరీ బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేశాము. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. కేవలం నాలుగు నెలల్లోనే ఫీడ్ ధరలను కిలోకు రూ.14 నుంచి రూ.16 వరకు పెంచారు. ఆక్వా సాగులో మొత్తం ఖర్చులో దాదాపు 60 శాతం ఫీడ్కే వెచ్చించాల్సి ఉంటుంది. మినరల్ మిక్సర్ ధరలు పెరిగాయని పెంచుతున్నారు. మరి ధరలు తగ్గినప్పుడు మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు ఎందుకు’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
‘రైతుల సమస్యలు కేవలం ఆక్వా రంగానికే పరిమితం కాలేదు. వరుసగా రెండేళ్లుగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధర దక్కడం లేదు. రైతు భరోసా పథకం కూడా ఇప్పుడు ఒక మోసంలా కనిపిస్తోంది. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న పాలకులు ఉంటేనే వారి పరిస్థితి మెరుగుపడుతుంది. మా ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నాము. రాష్ట్ర వ్యవసాయ, ఆక్వా ఎగుమతులను రూ.23 వేల కోట్లకు పెంచాం. రైతాంగానికి అండగా నిలవడం వల్లే రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు దక్కింది. నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ ప్రారంభిస్తే ప్రస్తుత ప్రభుత్వం మూసివేసింది. మెడికల్ కాలేజీల నిర్మాణాలను కూడా నిలిపివేసింది. 120 రోజుల పాటు పెరగాల్సిన ఆక్వా సీడ్ ప్రస్తుతం 90 రోజులు కూడా నిలవడం లేదు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖాముఖి సందర్భంగా రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను మీతోనే ఉన్నాను’ అంటూ రైతులకు ధైర్యం చెప్పారు. మరో మూడేళ్లలో రైతు అనుకూల ప్రభుత్వం తిరిగి వస్తుందని, అప్పటివరకు ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తున్న సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకలిస్తామని, రైతుల హక్కుల కోసం ఉద్యమబాట పట్టేందుకు వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.




