Google Earthquake Alert: వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భీకర భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ రెండు భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 7 కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. అయితే, ఈ భూకంపం భూమిని వణికించడానికి కొన్ని సెకన్ల ముందే గూగుల్ (Google) తన ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ అత్యంత వేగంగా ‘భూకంప అలర్ట్’ (Earthquake Alert) పంపింది. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వచ్చిన ఈ నోటిఫికేషన్కు సంబంధించిన స్క్రీన్షాట్లను పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ విపత్తులో మొదటి భూకంపం రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో రాగా.. సరిగ్గా 40 సెకన్ల వ్యవధిలోనే రెండోసారి 7.2 తీవ్రతతో సంభవించింది. ఈ జంట భూకంపాల ధాటికి అనేక బహుళ అంతస్తుల భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయినట్లు అనుమానిస్తుండగా, పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక యూజర్ షేర్ చేసిన గూగుల్ అలర్ట్ స్క్రీన్షాట్ ప్రకారం.. “341 కిలోమీటర్ల దూరంలో 6.2 తీవ్రతతో భూకంపం వస్తోంది” అని ఫోన్లో ముందే హెచ్చరిక వచ్చింది. గూగుల్ తన ప్రత్యేక సాంకేతికత, స్మార్ట్ఫోన్ నెట్వర్క్ సహాయంతో భూకంపాల కదలికలను, వాటి దిశను గుర్తిస్తుంది. ఆ వెంటనే ప్రభావిత ప్రాంతాల్లోని స్మార్ట్ఫోన్లకు కాంతి వేగంతో అలర్ట్ మెసేజ్లను పంపుతుంది.
ఫోన్లోని ‘యాక్సిలరోమీటర్’ సెన్సార్తోనే ఇది సాధ్యం
ప్రస్తుత మోడ్రన్ స్మార్ట్ఫోన్లలో ‘యాక్సిలరోమీటర్’ (Accelerometer) అనే సెన్సార్ ఉంటుంది. సాధారణంగా మనం ఫోన్ను తిప్పినప్పుడు స్క్రీన్ ల్యాండ్స్కేప్ లేదా నార్మల్ మోడ్లోకి మారడానికి ఈ సెన్సార్ ఉపయోగపడుతుంది. అయితే, ఇది ఫోన్లో జరిగే అతి సూక్ష్మమైన కదలికలను, ప్రకంపనలను (వైబ్రేషన్స్) కూడా గుర్తించగలదు. భూమిలో కంపనాలు మొదలైనప్పుడు ఈ సెన్సార్ ఆధారంగా గూగుల్ సిస్టమ్ అలర్ట్ అవుతుంది. ఒకే ప్రాంతంలోని వేలాది స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే డేటాను గూగుల్ నెట్వర్క్ క్షణాల్లో విశ్లేషిస్తుంది. ఆ ప్రకంపనలు కేవలం ఫోన్ కదలడం వల్ల వచ్చినవా లేక భూకంపం వల్లేనా అనేది నిర్ధారించుకుని, వెంటనే ఆండ్రాయిడ్ ఫోన్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2 బిలియన్ల (200 కోట్లు) ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ భూకంప అలర్ట్ నెట్వర్క్లో భాగంగా ఉన్నాయి. గూగుల్ సాధారణంగా భూకంప తీవ్రతను బట్టి రెండు రకాలుగా (స్వల్ప కంపనాలు, తీవ్రమైన కంపనాలు) అలర్ట్ మెసేజ్లను అందిస్తుంది.
ముందే అలర్ట్ వచ్చినా ప్రాణనష్టం ఎందుకు జరుగుతుంది?
గూగుల్ భూకంపం రావడానికి ముందే హెచ్చరించినప్పుడు ప్రజలు ఎందుకు సురక్షితంగా బయటపడలేకపోయారనే ప్రశ్న తలెత్తడం సహజం. నిజానికి గూగుల్ పంపే ఈ అలర్ట్ భూకంపం సంభవించడానికి కేవలం కొన్ని సెకన్ల ముందు మాత్రమే వస్తుంది. భూమి లోపల ప్రకంపనలు మొదలైన క్షణంలోనే డేటా ప్రాసెస్ అయ్యి మెసేజ్ వస్తుంది కాబట్టి, ఆ సమయం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ, ఆ కొన్ని సెకన్ల వ్యవధిలోనే అలర్ట్ చూసి అప్రమత్తమైన వారు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడానికి ఈ సాంకేతికత ఎంతోకొంత సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.




