Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ సీజన్ కోసం కీలక మార్పులు చేపట్టబోతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత ఇస్తూ, రెడ్ బాల్ ఆటగాళ్లకు భారీ ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ప్రతిపాదిత కాంట్రాక్టుల ప్రకారం టెస్ట్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు, నెలవారీ రిటైనర్లు గణనీయంగా పెరగనున్నాయి. పీసీబీ వర్గాల సమాచారం ప్రకారం, వైట్బాల్ హెడ్ కోచ్ మైక్ హెసన్, రెడ్బాల్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్లతో కూడిన కమిటీ కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ బ్లూప్రింట్ను సిద్ధం చేసింది. ఈ కొత్త విధానంలో ఆటగాళ్లను వారు ఆడే ఫార్మాట్ల ఆధారంగా వేర్వేరు ట్రాక్లుగా విభజించనున్నారు.
టెస్ట్ ఆటగాళ్లకు భారీ లాభాలు
కొత్త ప్రతిపాదన ప్రకారం ట్రాక్-ఏ కేటగిరీలో ఉండే టెస్ట్ క్రికెటర్లకు ఒక్కో టెస్ట్ మ్యాచ్కు సుమారు 15 లక్షల పాకిస్తానీ రూపాయల మ్యాచ్ ఫీజు లభించనుంది. గతంలో ఈ మొత్తం 8 లక్షల రూపాయలుగా ఉండేది. అంతేకాకుండా నెలకు సుమారు 40 లక్షల పాకిస్తానీ రూపాయల రిటైనర్ కూడా అందే అవకాశం ఉంది. టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్లలో కీలక పాత్ర పోషిస్తూ ట్రాక్-ఏ, ట్రాక్-బీ కేటగిరీల్లో చోటు దక్కించుకునే ఆటగాళ్లు మరింత లాభపడనున్నారు. అలాంటి క్రికెటర్లకు నెలకు 4.8 నుంచి 5 మిలియన్ పాకిస్తానీ రూపాయల వరకు రిటైనర్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఫార్మాట్ ఆధారిత కాంట్రాక్టులు
పీసీబీ తొలిసారిగా ఫార్మాట్ ఆధారిత సెంట్రల్ కాంట్రాక్ట్ విధానాన్ని అమలు చేయబోతోంది. ఇందులో ట్రాక్-ఏ టెస్ట్ క్రికెటర్ల కోసం, ట్రాక్-బీ వన్డే మరియు టీ20 అంతర్జాతీయ ఆటగాళ్ల కోసం, ట్రాక్-సీ ప్రధానంగా టీ20 స్పెషలిస్టులు మరియు ఫ్రాంచైజీ క్రికెట్ ఆడే ఆటగాళ్ల కోసం కేటాయించనున్నారు. ట్రాక్-బీ ఆటగాళ్లకు నెలకు సుమారు 18 లక్షల పాకిస్తానీ రూపాయల రిటైనర్ లభించనుండగా, ట్రాక్-సీ ఆటగాళ్లకు 12 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు రిటైనర్ అందే అవకాశం ఉంది.
బోనస్లలోనూ భారీ పెంపు
పీసీబీ ప్రదర్శన ఆధారిత బోనస్ విధానాన్ని కూడా మరింత ఆకర్షణీయంగా మార్చింది. ప్రతిపాదన ప్రకారం, పాకిస్థాన్ జట్టు ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే ఆటగాళ్లకు వారి మ్యాచ్ ఫీజుపై 500 శాతం అదనపు బోనస్ ఇవ్వనుంది. ఆసియా కప్ వంటి ఖండాంతర టోర్నమెంట్లలో విజయం సాధిస్తే 300 శాతం బోనస్ అందించనుంది.
కొత్త విధానంపై ఆసక్తి
ఈసారి సెంట్రల్ కాంట్రాక్టులు పొందే ఆటగాళ్ల పేర్లు, వారి కేటగిరీలను పీసీబీ బహిరంగంగా ప్రకటించకపోవచ్చని సమాచారం. ఒకవేళ అదే జరిగితే, పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి అవుతుంది. అయితే ఈ నిర్ణయం ఇప్పటికే కొంత విమర్శలకు కూడా దారితీస్తోంది. పీసీబీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ, టెస్ట్ క్రికెట్కు ప్రాధాన్యత పెంచడంతో పాటు ఆటగాళ్లకు గతంతో పోలిస్తే మరింత ఆర్థిక భద్రత కల్పించే దిశగా ఈ కొత్త విధానం ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది.




