ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర అంహారా ప్రాంతంలో ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. డెస్సీ ప్రాంతం నుంచి రాజధాని అడిస్ అబాబాకు వెళ్తున్న బస్సు సోమవారం తెల్లవారుజామున ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదానికి గురైంది. మార్గమధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రహదారి నుంచి పక్కకు దూసుకెళ్లి లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సరైన మౌలిక వసతులు, అంబులెన్స్ సేవలు లేకపోవడం వల్ల సహాయక చర్యలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గాయపడిన వారిలో పలువురు సమయానికి వైద్యం అందక మృతి చెందినట్లు సమాచారం. బాధితులను ప్రజా రవాణా వాహనాల్లో సమీప ఆస్పత్రులకు తరలించాల్సి వచ్చింది.
ప్రమాదం జరిగిన రహదారి కొండ ప్రాంతాల గుండా సాగుతూ ప్రమాదకర మలుపులతో ఉండటంతో ఇప్పటికే ప్రమాదాలకు కేరాఫ్గా గుర్తింపు పొందింది. అయితే ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇదే తరహాలో 2024 డిసెంబర్లో ఇథియోపియాలోని దక్షిణ సిడామా ప్రాంతంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఓ బస్సు నదిలో పడిపోవడంతో 66 మంది ప్రాణాలు కోల్పోయారు.




