AIIMS Study: వాయు కాలుష్యం (Air Pollution) వల్ల కేవలం ఊపిరితిత్తులు, గుండె జబ్బులు మాత్రమే వస్తాయని అనుకుంటే పొరపాటే. గర్భవతులు కలుషిత గాలిని పీల్చడం వల్ల కడుపులోని బిడ్డకు ఊహించని ముప్పు పొంచి ఉందని ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (AIIMS Delhi) పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. గాలిలోని హానికరమైన సూక్ష్మ ధూళి కణాలు పిండానికి రక్షణగా ఉండే మావి (Placenta – గర్భాశయంలో బిడ్డకు రక్తాన్ని, పోషకాలను అందించే భాగం)ను దెబ్బతీస్తాయని, దీనివల్ల కడుపులోనే శిశువు ఎదుగుదల ఆగిపోవడంతో పాటు అనేక ప్రసవ సమస్యలు వస్తాయని ఎయిమ్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
994 మంది గర్భిణుల డేటా ఆధారంగా పరిశోధన..
మనం పీల్చే గాలిలో ఉండే పీఎం 2.5 (PM2.5), పీఎం 10 (PM10) అనే కంటికి కనిపించని సూక్ష్మ కణాలు, బిడ్డ పుట్టిన తర్వాత సైతం వారి శారీరక, మానసిక ఎదుగుదలను ప్రభావితం చేస్తాయని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది. ఈ అధ్యయనం ‘ఎంబో మాలిక్యులర్ మెడిసిన్’ (EMBO Molecular Medicine) అనే జర్నల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు ప్రయోగశాల పరీక్షలు, జంతువులపై ప్రయోగాలు చేయడంతో పాటు గర్భిణుల నుంచి సేకరించిన నిజజీవిత డేటాను విశ్లేషించారు. కలుషిత గాలిలో గల అతి సూక్ష్మ కణాలు గర్భంలోని ‘మావి’ గోడలను దాటుకుని లోపలికి ప్రవేశిస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. దీనివల్ల అక్కడ ఇన్ఫ్లమేషన్ (వాపు), ఆక్సిడేటివ్ స్ట్రెస్ (కణాల నష్టం) ఏర్పడతాయి. ఫలితంగా కడుపులోని బిడ్డకు అందాల్సిన ఆక్సిజన్, అవసరమైన పోషకాల సరఫరా నిలిచిపోతుంది. ఇది రక్తనాళాల ఏర్పాటును, పోషకాల రవాణాను దెబ్బతీసి, శిశువు ఎదుగుదలను పూర్తిగా నియంత్రిస్తుంది. భిన్నమైన కాలుష్య స్థాయిలు ఉన్న ప్రాంతాలకు చెందిన సుమారు 994 మంది గర్భిణుల డేటాను శాస్త్రవేత్తలు పరిశీలించగా.. పీఎం 2.5 కణాలకు ఎక్కువగా గురైన వారిలో ‘ప్రీక్లాంప్సియా’ (గర్భధారణ సమయంలో వచ్చే ప్రమాదకరమైన అధిక రక్తపోటు) రావడంతో పాటు, తక్కువ బరువుతో పిల్లలు పుట్టే (Low birth weight) ముప్పు చాలా ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
‘IGFBP3’ అనే జన్యువుపై ఎఫెక్ట్..
ఇక, ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త సుభ్రదీప్ కర్మాకర్ షాకింగ్ విషయాలను వెల్లడించారు. కాలుష్య కణాలు కేవలం గర్భంలోకి చొరబడటమే కాకుండా, శిశువు ఎదుగుదలకు కారణమయ్యే జన్యువులను (Genes) సైతం మార్చేస్తున్నాయని చెప్పారు. “గర్భంలోని ప్లాసెంటా (మావి) కణజాలంలో లెడ్ (సీసం), కాడ్మియం, యాంటిమోని వంటి అత్యంత విషపూరితమైన భారీ లోహాలు పేరుకుపోతున్నట్లు ఆధారాలు లభించాయి. ఇవి నేరుగా పిండానికి చేరడం వల్ల భవిష్యత్తులో పిల్లల మెదడు ఎదుగుదల, నరాల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా శిశువు ఎదుగుదలలో కీలక పాత్ర పోషించే ‘IGFBP3’ అనే జన్యువును గాలి కాలుష్యం వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ పూర్తిగా అణిచివేస్తోంది.” అని వివరించారు.
ఇదే విషయాన్ని నిర్ధారించడానికి గర్భిణి ఎలుకలపై చేసిన ప్రయోగాల్లోనూ విస్తుపోయే ఫలితాలు వచ్చాయి. కలుషిత గాలికి గురైన ఎలుకలలో ప్లాసెంటా అసాధారణంగా మారడం, పుట్టిన పిల్లలు తక్కువ బరువు ఉండటం, వాటి ఎదుగుదల చాలా నెమ్మదించడం గమనించారు. అంతేకాదు, పుట్టిన తర్వాత సైతం ఆ పిల్లల ప్రవర్తన, శారీరక ఎదుగుదలలో తీవ్రమైన మార్పులు కనిపించాయి. అంటే గర్భంలో ఉన్నప్పుడు జరిగిన నష్టం జరగడమే కాదు.. పిల్లలు పుట్టాక కూడా వారిని ఈ సమస్య వెంటాడుతుందని స్పష్టమైంది. ఈ అధ్యయనం ద్వారా గాలి కాలుష్యం అనేది కేవలం శ్వాసకోస సమస్య మాత్రమే కాదని, తల్లీపిల్లల ఆరోగ్యానికి పెను ముప్పు అని తేలిపోయింది. ముఖ్యంగా రోజువారీ జీవితంలో విపరీతమైన కాలుష్యాన్ని ఎదుర్కొంటున్న నగరాల్లోని గర్భిణులను కాపాడుకోవడానికి తక్షణమే కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎయిమ్స్ పరిశోధకులు నొక్కి చెప్పారు. నగరాల్లో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తున్న తరుణంలో.. స్వచ్ఛమైన గాలి అనేది కేవలం మన ప్రస్తుత ఆరోగ్యానికే కాదు, రాబోయే తరాల మనుగడకు సైతం అత్యంత అవసరమని ఈ పరిశోధన హెచ్చరిస్తోంది.




