న్యూ చండీగఢ్ లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్, ఆఫ్ఘన్ బ్యాటర్ రహ్మత్ షా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ తొలి ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
అసలేం జరిగిందంటే..?
ఆఫ్ఘన్ బ్యాటర్ షరాఫుద్దీన్ అష్రఫ్ కాలి గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. తన భాగస్వామి ఇబ్బంది పడుతుండటంతో రహ్మత్ షా పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్లిపోయాడు. సిరాజ్ వేసిన ఓవర్ మూడో బంతిని రహ్మత్ బ్లాక్ చేయగా.. క్రీజులోనే ఉన్నప్పటికీ సిరాజ్ ఆగ్రహంతో బంతిని నేరుగా వికెట్ల వైపు బలంగా విసిరాడు.
సిరాజ్ అంతటితో ఆగలేదు. తర్వాతి బంతిని కూడా రహ్మత్ డిఫెండ్ చేయడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. రహ్మత్ దగ్గరకు వెళ్లి, డిఫెన్స్ ఆడటం ఆపి, సరైన షాట్లు ఆడాలంటూ సవాల్ విసిరాడు. దీంతో ఇద్దరి మధ్య కాసేపు వాడీవేడీ చర్చ నడిచింది.
Siraj aur Rahmat ke darmiyan field par garma-garmi
pic.twitter.com/3MtEjwIRHc
— Rehan 56 (@imrehan456) June 8, 2026
భారత్ చారిత్రాత్మక విజయం..
సిరాజ్ స్లెడ్జింగ్ మైండ్ గేమ్లా పనిచేసింది. ఆ తర్వాత కొద్ది ఓవర్లలోనే అరంగేట్రం స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో షరాఫుద్దీన్, రహ్మత్ షా ఇద్దరూ వెనుదిరిగారు. ఈ మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై చారిత్రాత్మక విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత్కు ఇదే అతిపెద్ద విజయం.
తొలి ఇన్నింగ్స్లో భారత్ 564/8 పరుగుల వద్ద డిక్లేర్ చేయగా, ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్లో 152 పరుగులకే ఆలౌట్ అయింది. సుతార్ 6 వికెట్లతో చెలరేగాడు. ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘన్ రెండో ఇన్నింగ్స్లోనూ కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. 2018లో రాజ్కోట్లో వెస్టిండీస్పై ఇన్నింగ్స్ మరియు 272 పరుగుల తేడాతో సాధించిన విజయాన్ని అధిగమించి భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది.




