Story Board: తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ మేరకు నెరవేరాయనే ఆత్మావలోకనం ఇప్పటికే మొదలైంది. అలాగే కేవలం ఉద్యమం గురించే కాకుండా అభివృద్ధి గురించి కూడా చర్చించే పరిస్థితి ఉండాలని ప్రజలు కోరుకుంటున్నట్టు.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలిపోయింది. ఇప్పుడు పవన్ ఎంట్రీ కొత్తగా జాతీయవాదంపై చర్చ రేకెత్తించింది. మరి తెలంగాణ ప్రజలు ఈ కోణాన్ని ఎలా చూస్తారనేది తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్దేశిస్తుందనడంలో సందేహం లేదు. ఎవరేమనుకున్నా.. తెలంగాణ రాజకీయాన్ని ఇప్పటిదాకా నడిపిన అంశాలకూ.. ఇక ముందు ప్రభావితం చేసే అంశాలకూ కచ్చితమైన తేడా ఉంటుందని ఇప్పటికే పార్టీలన్నీ పసిగట్టాయి. అందుకే అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ఇప్పటికే తమ రాజకీయ కార్యాచరణను అందుకు అనుగుణంగా మార్చుకుంటున్నాయి. బీజేపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు పవన్ కు ఉన్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా.. ఇక ముందు ఏం చేయనున్నారనేది మాత్రం తేలాల్సి ఉంది.
అసలు తెలంగాణలో పూర్తిస్థాయి రాజకీయం చేయటానికి పవన్ ముందున్న ఆప్షన్స్ ఏంటనే చర్చ కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలో పవన్ చెప్పినట్టుగా ఆయన ఇక్కడ వారాహి యాత్ర చేశారు. కానీ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతల్లో ఉన్న పవన్.. ఇక్కడ ఏ మేరకు సమయం కేటాయించి రాజకీయం చేస్తారు..? ఎలాంటి కార్యాచరణ తీసుకుంటారనేది ఆసక్తికర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. పవన్ చెప్పినట్టుగా పూర్తిస్థాయి రాజకీయం అంటే.. మరోసారి వారాహి తరహా యాత్రకు శ్రీకారం చుడతారా.. లేదంటే ఆయనే చెప్పినట్టుగా ఇక్కడి సమస్యలపై వరుసగా స్పందిస్తారా.. లేకపోతే మరేదైనా కొత్త వ్యూహం ఉందా అనేది చూడాల్సి ఉంది.
పవన్ పార్టీ జనసేనకు తెలంగాణలో ఉన్న బలాబలాలపై చర్చ వేరే విషయం. కానీ ఆ పార్టీకి ఇక్కడి సంస్కృతి, సాహిత్యం లాంటి విషయాల మీద అవగాహన అయితే ఉంది. గతంలో కొన్ని తెలంగాణ అంశాల మీద మాట్లాడిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు పవన్ సమస్యలపై మాట్లాడటం మొదలుపెడితే.. జనసేనకు ఆదరణ ఇంకా పెరుగుతుందనేది ఇక్కడి జనసైనికుల భావన. అదే విషయాన్ని పవన్కు వారు పదేపదే చెబుతున్నారనేది కూడా బహిరంగ రహస్యమే. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ కీలక ప్రకటన చేశారనే అభిప్రాయాలున్నాయి. అన్నింటికీ మించి తెలంగాణలో వచ్చే ఎన్నికలకు తామే ముందుగా గ్రౌండ్ సెట్ చేయాలనే యోచన కూడా పవన్ వ్యూహం అయ్యుండొచ్చనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో కూటమి గురించి కూడా పవన్ చాలా జాగ్రత్తగా మాట్లాడారు. ఎన్డీఏలో ఉన్నంత మాత్రాన.. భాగస్వామ్య పార్టీలు తనతో కలిసి నడవాలనేం లేదని, ఎవరి నిర్ణయం వారు తీసుకుంటారని తేల్చిచెప్పారు. తద్వారా మిత్రపక్షాలకు సావకాశంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి కల్పించారు.
తెలంగాణ నవనిర్మాణ సభ పెట్టదలుచుకున్న జనసేన నేతలు.. ఎలాంటి ఆలోచనలు పవన్తో పంచుకున్నారనేది రాబోయే రోజుల్లో బయటికొచ్చే అవకాశం ఉంది. ఆ అంశాలను బట్టి భవిష్యత్తులో సభలు పెడతారా.. ర్యాలీలు చేస్తారా.. లేదంటే సమస్యలపై ధర్నాలకు దిగుతారా అనేది క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తామని ఇప్పటికే పవన్ సంకేతాలిచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు లైమ్లైట్లో ఉన్న నేతల కంటే ముందే తాను తెలంగాణ సమస్యలపై గళమెత్తానని కూడా చెప్పుకొచ్చారు. కాబట్టి పవన్ ఏదైనా సమస్య ఎత్తుకుంటే.. అప్పుడు జనం నుంచి కూడా మంచి స్పందన రావచ్చనే ఆశాభావం తెలంగాణ జనసేన నేతల్లో ఉంది. కానీ పవన్ మాత్రం ఎక్కడా అతి అంచనాలకు అవకాశం ఇవ్వడం లేదు. అధికారం గురించి కాకుండా.. ప్రజల కోసం పనిచేయాలనే సందేశం ఇచ్చారు. ఎవరేమనుకున్నా.. జనసేన తన లక్ష్యాల కోసం పనిచేయాలనే ఆయన చెబుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే.. సమాజ విశాల ప్రయోజనాలే లక్ష్యమంటున్నారు. ఇప్పుడేం చెప్పినా.. ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ వ్యూహం బయటపడక తప్పదనే అంచనాలున్నాయి. అందుకోసం పవన్ ఒక్కో అడుగు ఎలా వేస్తారనేది తెలంగాణలో రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్న అంశం.
కేటీఆర్ చెప్పినట్టుగా పవన్ కు తెలంగాణలో రాజకీయం కొత్తేం కాదు. కానీ ఇప్పుడు పూర్తిస్థాయిలో రాజకీయం చేస్తానని చెప్పి బరిలోకి దిగుతున్నారు కాబట్టి.. ఇప్పటిదాకా చేసినదానికి.. ఇకపై చేసే దానికి కచ్చితమైన తేడా చూపించాల్సి ఉంటుంది. ఆ తేడా ఎలా ఉంటుందనే విషయంపై జనసేన నేతలు, క్యాడర్ నుంచి అభిప్రాయ సేకరణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత కొందరు మేధావులతో చర్చలు కూడా జరుపుతారనే వాదన వినిపిస్తోంది. అందరి అభిప్రాయాలు క్రోడీకరించాకే తుది కార్యాచరణ రూపొందిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద తెలంగాణలో పవన్ పూర్తిస్థాయి రాజకీయం చేయడం అయితే ఖాయమైపోయింది. అలాగే బీజేపీతో కలిసి నడిచే విషయంలోనూ ఎవరికీ అనుమానాల్లేవు. అంతిమంగా కూటమిగానే రాజకీయం చేయబోతున్నారు. పవన్ భాగస్వామిగా ఉండే కూటమి రాజకీయం.. ఎవర్ని దెబ్బతీస్తుందనేది మరో చర్చ. ఆ దెబ్బ ఎవరికి తగులుతుందనే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేకపోయినా.. కచ్చితంగా కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో దెబ్బ తగలటం అయితే ఖాయమే అంటున్నారు.




