ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త, మాజీ కమిషనర్ లలిత్ మోడీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను క్రికెట్ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణం అండర్వరల్డ్ బెదిరింపులేనని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ దావూద్ ఇబ్రహీం ముఠా తనను లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ‘‘దావూద్ ఇబ్రహీం నాపై మూడు సార్లు హత్యాయత్నం చేశాడని.. నా కొడుకును కిడ్నాప్ చేశాడు.’’ అని ఆరోపించారు.
ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ మాట్లాడారు.. ఐపీఎల్ తొలి సంవత్సరాల్లో మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు తాను కఠిన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. తన హయాంలో ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్ కేసు కూడా వెలుగులోకి రాలేదని పేర్కొన్నారు. “నేను ఐపీఎల్ కమిషనర్గా ఉన్న మూడు సంవత్సరాల్లో మ్యాచ్ ఫిక్సింగ్కు సంబంధించిన ఒక్క ఘటన కూడా జరగలేదు. అదే కొంతమందికి నచ్చలేదు. మ్యాచ్లను ప్రభావితం చేయడానికి వచ్చిన ప్రయత్నాలను నేను తిరస్కరించడంతో దావూద్ ఇబ్రహీం నెట్వర్క్ నాపై ఆగ్రహం వ్యక్తం చేసింది” అని ఆరోపించారు.
3 హత్యాయత్నాలు..
మ్యాచ్ ఫిక్సింగ్ను పట్టించుకోకుండా ఉండేందుకు వందల మిలియన్ డాలర్ల ఆఫర్లు వచ్చినప్పటికీ తాను అంగీకరించలేదని చెప్పారు. దీంతో తనపై మూడు సార్లు హత్యాయత్నాలు జరిగాయని ఆరోపించారు. “దావూద్ నాపై మూడు హిట్లు పెట్టాడు. మూడుసార్లు నన్ను చంపేందుకు ప్రయత్నించారు. కానీ ప్రతిసారి విఫలమయ్యారు” అని పేర్కొన్నారు.
2009 ఐపీఎల్తో వివాదం
2009లో భారత సాధారణ ఎన్నికల కారణంగా భద్రతా సమస్యలు తలెత్తడంతో ఐపీఎల్ను దక్షిణాఫ్రికాకు తరలించడంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పారు. ఆ సమయంలో టోర్నమెంట్ జరగదని భావించి బెట్టింగ్ సిండికేట్లు భారీ మొత్తాల్లో పందాలు కాశాయని తెలిపారు. అయితే ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించడంతో భారీ నష్టాలు ఎదుర్కొన్న సిండికేట్లు తనపై మరింత కక్ష పెంచుకున్నాయని ఆరోపించారు.
కుమారుడు కిడ్నాప్
తనకు ఎదురైన బెదిరింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించిన లలిత్ మోడీ.. లండన్లో తన కుమారుడిని కిడ్నాప్ చేశారని ఆరోపించారు. “ఇది నేను ఇంతవరకు ఎప్పుడూ బహిరంగంగా చెప్పలేదు. నా కుమారుడిని లండన్లో కిడ్నాప్ చేశారు” అని తెలిపారు. తనపై ఉన్న ముప్పును గుర్తించిన ముంబై పోలీసులు ఫోన్ సంభాషణలను రికార్డ్ చేశారని.. అనంతరం తనకు జడ్ కేటగిరీ భద్రత కల్పించారని చెప్పారు. తన ముంబై నివాసం వెలుపల కాల్పుల ఘటన కూడా జరిగిందని వెల్లడించారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో.. అలాగే మోంటెనెగ్రోలో తనపై కుట్రలు జరిగినట్లు ఆయా దేశాల భద్రతా సంస్థలు గుర్తించాయని తెలిపారు.
దావూద్తో మాట్లాడలేదు
2012లో లండన్లో జరిగిన ఒక సమావేశంలో తనను దావూద్ ఇబ్రహీంతో మాట్లాడించే ప్రయత్నం చేశారని కూడా లలిత్ మోడీ వెల్లడించారు. ఒక మధ్యవర్తి శాటిలైట్ ఫోన్ ద్వారా దావూద్కు కాల్ చేసి మాట్లాడాడని.. గత విభేదాలను పక్కనపెట్టాలని సూచించాడని చెప్పారు. అయితే తాను ఆ సంభాషణలో పాల్గొనలేదని, ఎలాంటి ఒప్పందానికి అంగీకరించలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్ వర్గాలతో పాటు రాజకీయ, భద్రతా వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారాయి.
#WATCH | On being asked if he retired from cricket because of Dawood Ibrahim, IPL founder and first chairman Lalit Modi says, "It is one of the biggest reasons."
He says, "He took three hits at me… Dawood himself said this… He missed three times… The reason was that I… pic.twitter.com/HKYlhdL2o6
— ANI (@ANI) June 4, 2026




