Ramchander Rao: కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అర్బన్ నక్సల్స్, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. జెన్జీ ఎప్పుడూ ఈ దేశంతో ఉంటుందన్నారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దేశ, రాష్ట్ర రాజకీయాలు, స్థితిగతుల గురించి మాట్లాడారు. ఎస్ఐఆర్ రెగ్యులర్గా జరిగే ప్రక్రియ అని.. ఇది ప్రభుత్వం చేస్తున్నది కాదన్నారు. ఎలక్షన్ కమిషన్ ఈ ప్రక్రియను కొనసాగిస్తోందని చెప్పారు. ఇక తెలంగాణ అంశంపై ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు సభలో విజయ శాంతి, కేసీఆర్ ఇద్దరు లేరని గుర్తు చేశారు. పార్లమెంట్ బిల్లుకు బేషరతుగా బీజేపీ సపోర్ట్ చేసిందని తెలిపారు. తెలంగాణ ఎందరో యువకుల బలిదానంతో వచ్చిందని హితవు పలికారు. 12 సంవత్సరాలు అయిన ఇంకా తెలంగాణ ఉద్యమ కారులను గుర్తించే పనిలోనే ఉన్నారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన వారిపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. నియామకాలు జరగలేదని.. రెండు ప్రభుత్వాలు వైఫల్యాలు చెందాయని ఎద్దేవా చేశారు. విద్య వ్యవస్థ నిర్వీర్యం అయిందని.. రూ. 10 వేల కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయన్నారు. రూ. 20 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని చెప్పారు. నీటి మీద రెండు ప్రభుత్వాలకు ఒక పాలసీ లేదన్నారు. కాళేశ్వరంలో అవినీతి చేశారని.. తుమ్మిదిహట్టి అంటూ ఇప్పుడు కాంగ్రెస్ మాట్లాడుతుందన్నారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా వాటర్ను.. సీఎం రేవంత్రెడ్డి కర్ణాటకకు బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కొరకుంట ప్రాజెక్ట్పై తెలంగాణ సంతకం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. “రాహుల్, డీకే శివకుమార్ల మెప్పు కోసం రేవంత్ రెడ్డి ఈ పని చేశారు. ఈ 12 ఏళ్లలో కేంద్రం నుంచి తెలంగాణకు రూ. 13 లక్షల కోట్లు వచ్చాయి. ఉత్తర తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ కన్నా బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ఏ లేదు. దక్షిణ తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది. వెస్ట్ బెంగాల్లో గెలిచినట్టు తెలంగాణలోనూ బీజేపీ గెలుస్తుంది. కేంద్ర పార్టీ కూడా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. దక్షిణాదిలో బీజేపీకి గేట్ వేగా తెలంగాణ మారనుంది. బీజేపీ సిద్ధాంతం హిందుత్వ, బీజేపీ ఎజెండా అభివృద్ధి. తెలంగాణ రాజకీయాల్లో సూపర్ హీరో బీజేపీ. బీజేపీ ప్రజలతో, ప్రజల కోసం పని చేసింది. మహిళ రిజర్వేషన్లను కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యతిరేకించింది. SIRను రెండు పార్టీ లు వ్యతిరేకించాయి. స్టాలిన్ మీటింగ్ పెడితే రేవంత్ కేటీఆర్ కలిసి వెళ్లారు. మమ్మల్ని బూతం లెక్క చూపిస్తున్నారు. తెలంగాణకు నిజమైన బూతాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. ఈ రెండు పార్టీలు తెలంగాణ సెంటిమెంట్ను మళ్ళీ తీసుకుస్తున్నాయి. వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ సెంటిమెంట్ను తెస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇస్తే ఏమయ్యేది. ఈ ఇష్యూను బీజేపీ మీద ఎందుకు రుద్దుతున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారు? ఆంధ్ర వాళ్లకు వ్యతిరేకంగా భాగో అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పైన ఏమీ చర్యలు తీసుకున్నారు? తెలంగాణలో పొత్తు అంశాన్ని జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది. ఈ దేశ లో ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు.” అని రామచందర్రావు వ్యాఖ్యానించారు.




