CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, మంత్రుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడే విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూనే, క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా సోషల్ మీడియా వారియర్లుగా మారి, ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ‘జమీందార్లు’గా తయారయ్యారని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో కేవలం తమ వ్యక్తిగత ప్రచారం తప్ప.. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను అస్సలు ప్రచారం చేయనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి మారాలని, సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు.
పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన కార్యకర్తలను, క్యాడర్ను ప్రజాప్రతినిధులు విస్మరించకూడదని సీఎం హెచ్చరించారు. “పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కచ్చితంగా పనిచేయాల్సిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు… ఇలా ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొనాలి. ఇందులో నాతో పాటు ఎవరికీ ఎలాంటి మినహాయింపులు లేవు” అని రేవంత్ రెడ్డి కరాఖండిగా తేల్చి చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
ఇకపై ఇన్ఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజును పూర్తిగా పార్టీ కార్యక్రమాల కోసమే కేటాయించాలని, నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి కార్యకర్తలను కలవాలని సీఎం ఆదేశించారు. కేవలం మంత్రులకే కాకుండా తనకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని చెబుతూ.. తాను కూడా ప్రతి 10 రోజులకు ఒకసారి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని, నెలలో మూడు రోజులు కేవలం కార్యకర్తల కోసమే సమయం ఇస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో పాటు రాబోయే రోజుల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన కాంగ్రెస్ అనుకూల ఓటర్ల ఓట్లు తొలగిపోకుండా (డిలీట్ కాకుండా) చాలా జాగ్రత్త పడాలని పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.




