ఆస్తుల కోసం రక్త సంబంధీకులే పగవాళ్లుగా మారుతున్నారు. సొంత వారిని హత్య చేయడానికి, చేయించడానికి వెనకాడటం లేదు. ఓ ఘటనలో ఆస్తి కోసం వదినను, మేనకోడలును.. మేనత్తలు హత్యలు చేయిస్తే.. మరో ఘటనలో సొంత అక్కను తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఆస్తుల కోసం హత్యలు చేస్తే.. ఆస్తులు దక్కుతాయో లేదో తెలియదు కానీ… నేరస్తులు మాత్రం అవుతున్నారు.
ఒకప్పుడు రక్తసంబంధం అంటే ఆప్యాయత, అనురాగం, అండగా నిలిచేవి. ప్రస్తుతం సమాజంలో అవే బంధాలు.. ఆస్తి, స్వార్థం, అనుమానాల మధ్య నరమేధాలకు, దారుణ హత్యలకు దారి తీస్తున్నాయి.
జంట హత్యలు
ఓ పామాయిల్ తోటలో తల్లీ, కూతురు దారుణ హత్యకు గురయ్యారు. అన్న ఆస్తి కోసం.. వదిన, మేన కోడలు కళ్లల్లో కారం చల్లి, చున్నీతో మెడ బిగించి.. దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా అనుమల మండలం ఇబ్రహీంపేటలో జరిగింది.
కొన్నేళ్ల క్రితం రుద్రాక్ష యాదయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. యాదయ్య మృతి తర్వాత వారసత్వంగా వచ్చిన అతని ఆస్తిని కూతురు లావణ్య పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. లావణ్య మైనర్ కావడంతో యాదయ్య తండ్రి, లావణ్య తాతను గార్డియన్గా ఉంచారు. కొద్దిరోజుల క్రితమే లావణ్య మైనారిటీ తీరి మేజర్ అయింది. లావణ్య పెళ్లి చేసుకుంటే తన అన్న ఆస్తి మొత్తం లావణ్యను పెళ్లి చేసుకునే భర్తకు చెందుతుందని భావించిన లావణ్య మేనత్తలు ఈ హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. యాదయ్య మరణం తర్వాత ఆస్తి తగాదాలు మొదలు కాగా అప్పట్లో పెద్దలు పంచాయితీని పరిష్కరించారు. కానీ తాజాగా లావణ్య మైనారిటీ తీరడంతో మళ్లీ పాత పంచాయితీలను తెరపైకి తెచ్చారు లావణ్య మేనత్తలు. ఈ నేపధ్యంలో కొద్ది కాలంగా ఆస్తి పంచాయతీ పతాక స్దాయికి చేరింది. యాదయ్యకు ఒక్కతే కూతురు కావడం.. యాదయ్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆస్తి అన్న కూతురుకు చెందడం ఇష్టం లేని మేనత్తలు భూ వివాదానికి తెరలేపారు. కొంత కాలంగా ఆస్తిలో వాటా కోసం పంచాయతీలు చేస్తున్నారు. అందులో భాగంగా హత్య జరగడానికి కొద్ది గంటల ముందు కూడా సుమలత, లావణ్య ఇంటి వద్ద ఆస్తి పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తి ఇవ్వడం కుదరదని… మేనత్తలకు కొంత నగదు ఇచ్చేందుకు కూడా యాదయ్య భార్య, కూతురు ఒప్పుకొని తమకు చెందిన పామాయిల్ తోట వద్దకు వచ్చారు. తల్లి సుమలత, కూతురు లావణ్య ఇద్దరూ వ్యవసాయ పనిలో నిమగ్నం కాగా… పథకం ప్రకారం పామాయిల్ తోట వద్దకు చేరుకున్న దుండగలు ఇద్దరి కళ్ళల్లో కారం చల్లి.. ఆ తర్వాత చీర కొంగు, చున్నీలతో ఇద్దరి మెడ బిగించి దారుణ హత్యకు పాల్పడ్డారు. విగత జీవులుగా పడి ఉన్న తల్లి కూతుర్లను చూసిన స్దానికులు గ్రామస్తులకు పోలీసులకు సమాచారం అందివ్వడంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్స్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ టీం సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించింది. భూ తగాదాల వల్లే ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆస్తికొసం జరిగిన ఈ హత్యలో ఇద్దరు మేనత్తలు కీలక వ్యక్తులు కాగా సుపారీ గ్యాంగ్ ఈ హత్యలకు పాల్పడగా…. ఆ కుంటుంబానికి దగ్గరి బందువైన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మొత్తం ఈ హత్యకు స్కెచ్ వేసినట్లు వినిపిస్తుంది.
మరోవైపు సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం తుమ్మల పెన్పహాడ్లో అక్క అంజమ్మను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు తమ్ముడు సైదులు. చెల్లెలు ఉమతో సైదులుకు భూవివాదాలు ఉండగా.. ఆ భూవివాదంలో తన అక్క అంజమ్మ చెల్లెలు ఉమకు అండగా నిలబడటాన్ని సహించలేని సైదులు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం కరువు పనికి ఒంటరిగా వెళ్తున్న అక్క అంజమ్మపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. 2007లో ఉమకు వివాహ సమయంలో పసుపు , కుంకుమల కింద గ్రామంలోని సర్వే నం 119 లో రెండున్నర ఎకరాల భూమి ఇచ్చారు . సదరు భూమికి సంబంధించి ఉమకు అన్న సైదులకు మధ్య తరచు గొడవల జరుగుతున్నాయి. గొడవ జరిగిన ప్రతీసారి అంజమ్మ చెల్లెలు ఉమకు మద్దతుగా ఉంటుంది. అంజమ్మ కూడా ఒంటరి మహిళ, అమె తన తల్లితో కలిసి ఉమ ఇంట్లోనే ఉంటుంది. తన చెల్లి ఉమతో భూవివాదానికి తల్లి, అక్క అంజమ్మ అని భావించిన సైదులు అక్కపై కొపం పెంచుకున్నాడు. అంజమ్మను పథకం ప్రకారం తన బావమరుదుల సహాయంతో కల్లు గీసే కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు..
అంజమ్మ హత్య సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని అంజమ్మ మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించి.., సంఘటనా స్ధలంలో క్లూస్ సేకరించారు.. హత్యలో సైదులుతో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మొత్తంగా ఇటీవల కాలంలో కుటుంబ బంధాలు…. ప్రేమ… మానవత్వం.. అన్ని ఆస్తి, అహంకారం, స్వార్థం ముందు కనుమరుగైపోతున్నాయి. ఆస్తి కోసం ఆత్మీయుల అంతం చేసుకొవడం కలకలం రేపుతుంది.




