తీవ్రమైన ఎండలు, అంధకారం కలిసి ఒక పౌల్ట్రీ ఫామ్ యజమానికి భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దురదృష్టకర సంఘటనలో.. కేవలం మూడు గంటల వ్యవధిలోనే ఏకంగా 5,300 కోళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతల మధ్య ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణంగా మారింది.
హీట్ ఛాంబర్గా మారిన పౌల్ట్రీ షెడ్..
బాధిత పౌల్ట్రీ ఫామ్ యజమాని టుటు పాఢి తెలిపిన వివరాల ప్రకారం.. అది అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఎన్విరాన్మెంట్-కంట్రోల్డ్ (EC) పౌల్ట్రీ ఫామ్. ఈ మూసి ఉన్న (ఎన్క్లోజ్డ్) షెడ్లలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడానికి కూలింగ్ ఫ్యాన్లు, వెంటిలేషన్ సిస్టమ్స్ నిరంతరం నడవాల్సి ఉంటుంది. అయితే.. ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ హఠాత్తుగా చెడిపోవడంతో కరెంట్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కూలింగ్ సిస్టమ్స్ ఆగిపోయి, మూసి ఉన్న ఆ షెడ్లు కాసేపట్లోనే ఒక వేడి కొలిమిలాగా మారిపోయాయి. విపరీతమైన వేడిని తట్టుకోలేక లోపల ఉన్న వేలాది కోళ్లు శ్వాస ఆడక, తీవ్రమైన ఎండ దెబ్బకు గురై గంటల వ్యవధిలోనే కుప్పకూలాయి.
డీజిల్ దొరక్క పెరిగిన నష్టం..
విద్యుత్ పోయిన వెంటనే యజమాని పాఢి ప్రత్యామ్నాయంగా తన వద్ద ఉన్న డీజిల్ జనరేటర్ను రన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ.. దురదృష్టవశాత్తూ జనరేటర్కు సరిపడా డీజిల్ అందుబాటులో లేదు. స్థానిక ఇంధన స్టేషన్లలో డీజిల్ కొరత ఉండటం, అత్యవసర పరిస్థితి అని మొరపెట్టుకున్నప్పటికీ బారెల్స్లో డీజిల్ ఇచ్చేందుకు వారు నిరాకరించడంతో జనరేటర్ ప్రారంభించలేకపోయాడు. మల్కన్గిరిలోని విపరీతమైన ఎండలకు ఆ జనరేటర్ గంట నడవాలన్నా దాదాపు 7 లీటర్ల డీజిల్ అవసరమవుతుంది.
చివరకు విద్యుత్ పునరుద్ధరణ జరిగే సమయానికే దాదాపు 12 నుంచి 12.5 టన్నుల బరువున్న 5,300 కోళ్లు చనిపోయాయి. డీజిల్ సకాలంలో దొరకకపోవడం వల్లే తనకు సుమారు రూ. 15 లక్షల వరకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని యజమాని కన్నీరుమున్నీరయ్యాడు. ఈ ఘటనపై పరిహారం లేదా డీజిల్ కొరత ఆరోపణలపై స్థానిక అధికారులు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.




