Guntur Job Fraud: గుంటూరు జిల్లాలో ఉద్యోగాల పేరుతో విద్యార్థులను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. ప్రముఖ విద్యాసంస్థ అయిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ సహచరులనే లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కడప జిల్లాకు చెందిన విజయ నరసింహ, వరుణ్ అనే విద్యార్థులు “వెబ్ ఎక్స్” పేరుతో స్టార్టప్ కంపెనీ నడుపుతున్నామని తోటి విద్యార్థులను నమ్మించినట్లు సమాచారం. తమ కంపెనీలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, భారీ ప్యాకేజీలతో ప్లేస్మెంట్లు కల్పిస్తామని చెప్పి పలువురిని ఆకర్షించారు.
ఈ నమ్మకంతో పలువురు విద్యార్థులు లక్షల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థుల నుంచి దాదాపు కోటిన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా ఎలాంటి ఉద్యోగాలు రాకపోవడంతో విద్యార్థులకు అనుమానం మొదలైంది. దీంతో విజయ నరసింహ, వరుణ్లను పలుమార్లు ప్రశ్నించగా వారు కమాయమాటలు చెబుతూ కాలయాపన చేసినట్లు బాధితులు చెబుతున్నారు. చివరకు మోసపోయామని గ్రహించిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి మంగళగిరి రూరల్ పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థుల నుంచి సేకరించిన డబ్బు ఎక్కడికి వెళ్లింది, ఇంకా మరెవరైనా ఈ మోసంలో ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగాల పేరుతో వస్తున్న ఆఫర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.




