పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ దేశాలను సంక్షోభంలోకి నెట్టింది. అన్ని రకాలుగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ప్రధాని మోడీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. పౌరులంతా పొదుపు పాటించాలని సూచించారు. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇక వాహనదారుల్లో భయాందోళనలు కూడా మొదలయ్యాయి. భారీగా పెరగవచ్చన్న వదంతులతో మరోసారి పెట్రోల్ బంకుల దగ్గర క్యూ లైన్లు పెరిగాయి.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగొచ్చన్న వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో అనేక నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కనిపించాయి. కొందరు వినియోగదారులు ట్యాంకులు పూర్తిగా నింపించుకునేందుకు పోటీపడగా.. మరికొన్ని ప్రాంతాల్లో “నో ఫ్యూయల్”, “నో స్టాక్” బోర్డులు కూడా దర్శనమిచ్చాయి.
ఇంధన ధరలు లీటర్కు రూ.5 నుంచి రూ.20 వరకు పెరగొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. చమురు మార్కెటింగ్ సంస్థలపై పెరుగుతున్న భారం, ప్రభుత్వ ఆర్థిక ఒత్తిడి, పెరుగుతున్న దిగుమతి బిల్లు కారణంగా త్వరలో ధరల పెంపు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్లోని అల్వార్లో అనేక పెట్రోల్ బంకుల దగ్గర “నో పెట్రోల్”, “నో డీజిల్” బోర్డులు కనిపించాయి. వినియోగదారులు పెట్రోల్ ధరలు రూ.5 నుంచి రూ.15 వరకు, డీజిల్ ధరలు రూ.10 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
భువనేశ్వర్లో మాత్రం పెట్రోల్ బంక్ యజమానులు ఇవన్నీ కేవలం పుకార్లేనని పేర్కొన్నారు. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. అయితే ధరలు పెరిగితే సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావం ఉంటుందని అంగీకరించారు.




