Narendra Modi : భాగ్యనగర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ మాదాపూర్లోని హెచ్ఐసీసీ (HICC) వేదికగా తెలంగాణకు వరాల జల్లు కురిపించారు. సుమారు రూ. 9,377 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ను జాతికి అంకితం చేయడంతో పాటు, గుడెబల్లూర్-మహబూబ్నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి వర్చువల్ విధానంలో పునాది వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోడీ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మన్మోహన్ సింగ్ గుజరాత్ అభివృద్ధికి ఎలా సహకరించారో, ఇప్పుడు తెలంగాణకు ప్రధాని మోడీఈ అలాగే సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. “రాజకీయాల గురించి మాట్లాడనని రేవంత్ రెడ్డి అన్నారు, నేను కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడను. కానీ వాస్తవాలను గమనించాలి” అని వ్యాఖ్యానించారు. ఒకవేళ గత పదేళ్లలో గుజరాత్కు ఇచ్చినన్ని నిధులే తెలంగాణకు ఇస్తే, ఇప్పుడు వస్తున్న దానికంటే సగం నిధులు మాత్రమే వస్తాయని, అప్పుడు మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగదని చురకలంటించారు. రాజకీయాలకు అతీతంగా మాతో కలిసి పనిచేయాలని సీఎంకు సూచించారు.
తెలంగాణలో గత పదేళ్లలో జాతీయ రహదారులు రెట్టింపు అయ్యాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు. ముఖ్యంగా రైల్వే రంగంలో రాష్ట్రానికి అందుతున్న ప్రాధాన్యతను ఆయన గణాంకాలతో వివరించారు. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే వెయ్యి కోట్ల కంటే తక్కువ రైల్వే బడ్జెట్ ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం తెలంగాణకే ఏడాదికి రూ. 5,500 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 15 వేల కోట్ల విలువైన రైల్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు , 6 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను అందించినట్లు వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తాను బలంగా నమ్ముతానని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి సాగాలని ఆయన సూచించారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.




